చిత్తూరు : ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, ఎన్నో విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ, నటుడు, పలు స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్న మోహన్ బాబు నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంలతో నిరసనలకు అనుమతులు లేకపోవడంతో మోహన్ బాబు నిరసన చేసేందుకు వీల్లేదని పోలీసులు తెలిపారు. అయితే ఎట్టిపరిస్థితిలోనూ నిరసనను కొనసాగిస్తానంటూ మోహన్ బాబు తమ కుమారులతో కలసి తమ కాలేజీ విద్యార్థులు, ఇతర కాలేజీ విద్యార్థులతో ఫీజు బకాయిల చెల్లింపుపై ఆయన భారీ ర్యాలీగా బయల్దేరారు. నిరసనతో పాటు ధర్నా చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తిరుపతి సమీపంలోని రంగంపేటలో ఉన్న శ్రీవిద్యా నికేతన్ కు భారీ ఎత్తున చేరుకున్నారు. ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే ఆయన్ను హెచ్చరిస్తామని, వినకుంటే అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.