ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేతలు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా నామినేషన్ దాఖలు చేసి ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించారు. ఇందులో ఆశ్చర్యకరంగా తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి వాహనాలు లేవని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో గంటా ఇంతకంటే పెద్ద షాకిచ్చారు. 2014-15లో తన ఆదాయాన్ని సున్నాగా చూపించారు. ఇప్పుడు రూ.30.3 లక్షలుగా చూపారు. తాజా ఎన్నికల అఫిడవిట్ లో తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువను రూ.17.8 కోట్లుగా వెల్లడించారు. వాటిలో చరాస్తుల విలువను రూ.11.74 కోట్లుగా, స్థిరాస్తుల విలువను రూ.5.75 కోట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో కోటి రూపాయల మేరకు బ్యాంకులకు అప్పులు కట్టాల్సి ఉందని వివరించారు. ఇక తన భార్య శారదకు రూ.18 లక్షల విలువ చేసే బంగారం ఉన్నట్టు గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. గంటా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.