ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ప్రధాని పదవి చేపట్టవచ్చునంటూ బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని మాయావతి ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధాని లేదా మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికైతే చాలునని ఆమె అన్నారు. తాను తొలిసారిగా 1995లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు శాసనసభ లేదా శాసనమండలి సభ్యురాలిని కాదని ఆమె గుర్తు చేశారు. అలాగే కేంద్రంలో కూడా పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా లోక్సభ, రాజ్యసభ సభ్యత్వం పొందితే సరిపోతుందని ఆమె అన్నారు. లోక్సభకు పోటీ చేయబోనని చెప్పినందుకు కార్యకర్తలు బాధపడనవసరం లేదని ఆమె చెప్పారు.