గుంటూరు: డెల్టా ప్రాతంలో పర్యటించే అర్హత జగన్ కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నక్కా మాట్లాడారు. పది సంవత్సరాల నుండి అనేక కష్టాలు పడుతున్న రైతులకు పట్టిసీమ ద్వారా పదమూడు లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. పట్టిసీమ వ్యతిరేకించి కట్టడానికి వీల్లేదని జగన్ అడ్డం పడ్డాడని విమర్శించారు. డెల్టా సస్యశ్యామలంగా ఉందంటే అది పట్టిసీమ వల్లనేనన్నారు. ఈ రాష్ట్రంలో కుట్రలు కుయుక్తులతో జగన్ రాజకీయాలలో నిల్చున్నాడన్నారు. సొంత చిన్నాన్నను చంపి ఎక్కడ నిజాలు బయట పడతాయని సిబిఐ విచారణ అంటున్నాడని విమర్శించారు. అక్కడ మోడీ సాయం చేస్తాడని సిబిఐ విచారణ కోరుతున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే నేరాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేయకూడదా? అని ప్రశ్నించారు.
వాస్తవాలు బయటికి వస్తాయని జగన్ భయపడిపోతున్నాడన్నారు. ప్లాన్ ప్రకారమే హత్య చేసి చంద్రబాబునాయుడు చేశాడని డ్రామా మెదలుపెట్టాడన్నారు. జగన్ కు కేసీఆర్ ఐదువందల కోట్లు, బిజెపి వాళ్ళు రెండువేల కోట్లు ఇస్తున్నారన్నారు. ఈ పదిరోజులు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఈరోజు టిడిపి ప్రభుత్వ అభివృద్ధి పట్ల అన్ని వర్గాలవారు సంతృప్తిగా ఉన్నారన్నారు. హైదరాబాదులో ఆస్తులున్న టిడిపి అభ్యర్థులను కేసీఆర్ తో కలిసి జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర్ అధికారంలో ఉండగా అనేకమంది మా కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. పోలవరాన్ని ఆపాలని చూస్తున్న కేసీఆర్ తో జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని మంత్రి నక్కా విమర్శించారు.