ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌,,,, గుజరాత్ వెళ్లొచ్చిన బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 07:46 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని మోడల్స్‌ను పరిశీలించేందుకు.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఆధ్వర్యంలో అధికారులు గుజరాత్ వెళ్లారు. ఏపీ ప్రభుత్వం అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పాటుగా దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పరిశీలించారు. జిందాల్ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌, ఏక్తా నగర్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని పరిశీలించారు. అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించిన సాంకేతిక అంశాలను తెలుసుకున్నారు.


గుజరాత్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు మంత్రి నారాయణ బృందం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని సందర్శించింది. ఈ స్టేడియాన్ని కేవలం తొమ్మిది నెలల్లోనే నిర్మించారని.. ఈ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను గుజరాత్ క్రీడల శాఖ అధికారులు ఏపీ మంత్రితో పాటూ వెళ్లిన బృందానికి వివరించారు. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం ప్లాన్ చేయగా.. దీని కోసం మోదీ స్టేడియం ప్రత్యేకతలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.


మొదటి రోజు మంత్రి బృందం జిందాల్ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను సందర్శించింది. అక్కడ ఘన వ్యర్థాల నుంచి విద్యుత్, పేపర్ బ్లాకుల తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్లాంట్‌కు రోజూ వచ్చే వ్యర్థాలను ఎలా ప్రాసెస్ చేస్తున్నారో తెలుసుకున్నారు. అలాగే మంత్రి నారాయణ బృందం ఏక్తా నగర్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని సందర్శించింది. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన టెక్నాలజీ, మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు ఈ విషయాలను వివరించారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ శివారులో ఉన్న గిఫ్ట్ సిటీని కూడా మంత్రి బృందం సందర్శించింది. ఇది 860 ఎకరాల్లో ఉంది.. ఇక్కడ సెజ్‌లు, కంపెనీలు ఉన్నాయి. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి భాస్కర్‌తోపాటు గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com