ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 07:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అధికారం కోల్పోయిన తర్వాత పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి జంప్ అవుతూ ఉండటంతో ఇప్పటికే పలు కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ కోల్పోయింది. తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ వైసీపీ చేజారింది. కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కదిరి మున్సిపాలిటీని కూడా వైసీపీ కోల్పోయింది. కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్‌పై బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి 25మంది కౌన్సిలర్లు హాజరు కాగా.. చైర్ పర్సన్‌తో పాటు వైసీపీ 11మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కోరం ఉండటం... హాజరైన మొత్తం 25మంది అవిశ్వాసానికి మద్దతివ్వడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కదిరి మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.


మరోవైపు కదిరి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం నెగ్గటంతో టీడీపీ శ్రేణులు టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.. ప్రజాస్వామ్యయుతంగానే అవిశ్వాసం జరిగిందన్నారు. కదిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ నజీమున్నిసా అవినీతికి పాల్పడ్డారని.. కదిరిలో అభివృద్ధి లేదని ఆరోపించారు. అందుకే వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారన్న కందికుంట వెంకటప్రసాద్.. కదిరి అభివృద్ధి కోసమే అవిశ్వాసం పెట్టినట్లు తెలిపారు. త్వరలో అందరికీ ఆమోదకరంగా ఉండేలా మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు.


మరోవైపు విశాఖపట్నం మేయర్ పీఠం వైసీపీ చేజారిన సంగతి తెలిసిందే. విశాఖ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇటీవల నెగ్గింది. దీంతో హరి వెంకట కుమారిని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని అందులో పేర్కొంది. విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి 2/3 వంతు సభ్యులు అనుకూలంగా ఓటు వేయటంతో తీర్మానం నెగ్గింది. 110 మంది సభ్యుల్లో 74 మంది తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గగా.. విశాఖ మేయర్ పదవి నుంచి హరి వెంకట కుమారిని తొలగిస్తూ ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరోవైపు విశాఖ మేయర్ పదవికి ఏప్రిల్ 28న ఎన్నిక నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com