ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరీరంపై 53 కత్తిపోట్లు.. ఇంత ఘోరమా,,,వీరయ్య చౌదరి దారుణ హత్యపై చంద్రబాబు ఎమోషనల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 07:25 PM

టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు వెళ్ళిన చంద్రబాబు.. వీరయ్య చౌదరి భౌతికకాయానికి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరి హత్య ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు. దర్యాప్తు కోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరోవైపు ముసుగులు ధరించిన వ్యక్తులు వీరయ్య చౌదరిపై ఆయన ఆఫీసులోనే కత్తులతో దాడి చేసిన సంగతి తెలిసిందే.


తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందన్న సీఎం చంద్రబాబు.. వెంటనే ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు. హత్య జరిగిన తీరు చూస్తే చాలా దారుణంగా ఉందని.. కరడుగట్టిన నేరస్థులు కూడా ఇలా చేయరని ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య చౌదరి శరీరంపై 53 కత్తిపోట్లు ఉన్నాయని.. రాష్ట్రంలో ఇంతటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అని అనిపిస్తోందన్నారు.వీరయ్య చౌదరి నారా లోకేష్ యువగళం కార్యక్రమంలో వందరోజులు పాల్గొన్నారని.. అమరావతి రైతుల పాదయాత్రలో అండగా నిలిచారని చంద్రబాబు గుర్తు చేశారు. వీరయ్య చౌదరి పార్టీ కోసం కష్టపడ్డారని.. నాగలుప్పలపాడు మండలంలో 10 వేల ఓట్ల మెజార్టీ తెచ్చే స్థాయికి ఎదిగాడన్నారు. అలాంటి మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.


భిన్నాభిప్రాయాలు ఉంటే హత్యలు చేయడం రాక్షసత్వమన్న చంద్రబాబు.. నేర రాజకీయాలు చేసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. వీరయ్య చౌదరి హత్య ఘటనకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 9121104784కు తెలియజేయాలని చంద్రబాబు కోరారు. నేరాలకు పాల్పడిన వారిని తప్పకుండా పట్టుకొని శిక్షిస్తామని.. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోతారని చంద్రబాబు హెచ్చరించారు.


వీరయ్య చౌదరి హత్య.. ఆఫీసులో ఏం జరిగిందంటే?


వీరయ్య చౌదరి హత్య జరిగినప్పుడు ఆఫీసులో ఏం జరిగిందనేదీ చంద్రబాబు వివరించారు. ఘటన జరిగినప్పుడు ఆఫీస్‌లో ఉన్న వ్యక్తిని కూడా బెదిరించారని.. నిందితులు ముసుగులు ధరించి వచ్చారని చెప్పారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారని వివరించారు. నిందితులను కఠినంగా శిక్షించి వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి చేకూరుస్తామని చెప్పారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని ఆదుకుంటామన్న చంద్రబాబు.. వారిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామన్నారు. పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ పెద్దగా తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇలాంటి దుర్మార్గులను తుదముట్టించే వరకు పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ హత్య కేసును ఛేదించే వరకు పోలీసులు నిద్రపోరని, నిందితులను పట్టుకొని శిక్షిస్తామని తేల్చి చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com