కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రజల దృష్టి మళ్ళించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ను పదేపదే అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... డీజీపీ కేడర్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూడా దీనిలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కాంట్రాక్ట్ సంస్ధల నుంచి ముడుపుల స్వీకారం, హామీలను అమలు చేయకపోవడం, కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా సూట్కేసు కంపెనీలకు దారాదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి డర్టీ పాలిటిక్స్కు చంద్రబాబు తెరదీశారని అన్నారు. ఆమె మాట్లాడుతూ.... గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులుని అరెస్ట్ చేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఎటువంటి అరాచకాలకు పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్ ల చేత నెత్తిన కిరీటం పెట్టించుకోవాలని తహతహలాడుతూ తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులంతా భవిష్యత్తు గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రాబోయేది మళ్లీ వైయస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్ సీఎం అయ్యాక తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి జైళ్లకు పంపుతాం అని హెచ్చరించారు.
![]() |
![]() |