'చౌకీదార్ చోర్ హై(కాపలదారుడు దొంగ)' అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మోదీని విమర్శించేందుకు తమను కించపరచాలా అని చౌకీదార్(సెక్యూరిటీ గార్డ్స్) ప్రశ్నిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ తాజాగా ముంబైకి చెందిన సెక్యూరిటీ గార్డ్స్ అసోసియేషన్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్పై కేసు నమోదు చేయాల్సిందిగా కోరింది.
సెక్యూరిటీ గార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ ఘుగే రాహుల్ చేస్తున్న చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు దీన్నో నేరంగా పరిగణించాలని, ఆయన వ్యాఖ్యలు సెక్యూరిటీ గార్డ్స్ను తీవ్రంగా అవమానించడమేనని అన్నారు. కాగా, కాంగ్రెస్ సభలు, ర్యాలీల్లో రాహుల్ గాంధీ తరుచుగా 'చౌకీదార్ చోర్ హై' అంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాఫెల్ డీల్ కుంభకోణం విషయంలో రాహుల్ మోదీపై ఇదే విమర్శతో దాడి చేస్తున్నారు.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేత అల్కా లంబా కూడా మోదీపై చౌకీదార్ వ్యాఖ్యలు చేశారు. 'ఈసారి ప్రజలు ప్రధానమంత్రిని ఎన్నుకోవాలి. కాపలదారుడే కావాలనుకుంటే నేపాల్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అయితే నేపాల్ కాపలాదారులు దొంగలు కావు.' అంటూ వ్యాఖ్యానించారు. ఏదేమైనా రాహుల్ వ్యాఖ్యలపై సెక్యూరిటీ గార్డ్స్ ఆగ్రహం చెందుతుండటంపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.