ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా నుంచి అమ్మ రాగానే పెళ్లంటూ కోట్లు కాజేశాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:35 PM

అతడు బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్‌లకు అలవాటుపడిన ఆ యువకుడు.. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ల వేదికగా మోసాలకు తెరతీశాడు. రెండో పెళ్లి కోసం చూస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని.. తన ప్లాన్‌ను అమలు చేసేవాడు. అలాగే, ఓ ఎమ్మెల్యే ఫోటోను డీపీగా పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. పెళ్లి పేరుతో పలు రాష్ట్రాల్లోని యువతులను బురిడీ కొట్టించి.. కోట్లు కాజేసిన ఈ నకిలీ పెళ్లికొడుకు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల‌లో తప్పుడు వివరాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని పలువురు అమ్మాయిల్ని మోసగించిన కేటుగాడి ఆటకట్టించారు తెలంగాణ పోలీసులు.


హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్‌ హర్ష చెరుకూరి (33) పుదుచ్చేరిలోని యానాంకి చెందిన ఎమ్మెల్యే ఫొటోతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో తప్పుడు వివరాలు పెట్టి.. తాను ఎన్నారై, వ్యాపారి, ఐటీ ఉద్యోగినంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో రెండో పెళ్లి కోసం ప్రయత్నించేవాళ్లు, 30 ఏళ్లు వయసుదాటిన మహిళలను టార్గెట్ చేస్తూ.. వాట్సప్‌ కాల్‌ ద్వారా వారితో సంప్రదింపులు జరిపేవాడు. మాయమాటలతో వారిని బోల్తాకొట్టించేవాడు.


అమెరికాలో మా అమ్మ పెద్ద డాక్టర్ అని.. తాను ఇండియాలో ఉంటూ వ్యాపారం చేస్తుంటానని చెప్పేవాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే పెళ్లి చేసుకుందామని నమ్మబలికేవాడు. వారికి నమ్మకం ఏర్పడిన తర్వాత తన ప్లాన్ అమలు చేసేవాడు. బ్యాంకు అకౌంట్‌లు ఫ్రీజ్‌ చేశారని, ఐటీ అధికారులు రైడ్ చేసి డబ్బులు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు హాస్పిటల్స్‌లో ఉన్నారని, వ్యాపారంలో నష్టం వచ్చిందని ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కారణం చెప్పి రూ.5-25 లక్షల వరకూ వారి నుంచి కొట్టేశాడు. తమ డబ్బులు ఇచ్చేయమని ఎవరైనా డిమాండ్‌ చేస్తే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు.


ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరించేవాడు. బాధితుల నుంచి కొట్టేసిన సొమ్ముతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌లు, జల్సాలు చేస్తుండేవాడు. ఇటీవల జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక డాక్టర్ దగ్గర ఇలాగే రూ.10.94 లక్షలు లాగేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. మార్చి 13న బెంగళూరులో అరెస్ట్‌ చేశారు.


బీటెక్‌ మధ్యలోనే ఆపేసిన నిందితుడు వంశీకృష్ణ.. 2014లో హైదరాబాద్‌ వచ్చాడు. ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌లకు అలవాటుపడి.. 2016లో జాబ్‌ కన్సల్టెన్సీలో చేరి పలువుర్ని ఉద్యోగాల పేరిట మోసం చేసిన కేసులో అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదు. సోషల్ మీడియాలో మహిళల పేర్లతో ఫేక్ అకౌంట్‌లు సృష్టించి తన సంపాదనలో ఎక్కువ మొత్తం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్టు నమ్మించేవాడు. ఇలా దాదాపు 1,000 మంది నుంచి డబ్బు వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. అలాగే, యానాంలోని ఓ ఎమ్మెల్యే ఫొటో డీపీగా పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 50 మంది మహిళల నుంచి రూ.2.50 కోట్లు కాజేశాడు. అతడి మోసాలపై వరుస ఫిర్యాదులతో రెండేళ్ల కిందటే సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com