కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో ఎక్కువ మంది ఏదైనా సమాచారం కావాలన్నా, శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి గదులు వంటి వాటి కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ సందర్శిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు మాత్రం దళారులను ఆశ్రయించి మోసపోతూ ఉంటారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినప్పటికీ.. భక్తులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదు. తాజాగా ఇలాంటి మోసం ఒకటి తిరుమలలో వెలుగుచూసింది.
టీటీడీ ఛైర్మన్ జనరల్ సెక్రటరీ పేరుతో ఇద్దరు దళారులు శ్రీవారి భక్తులను మోసం చేసిన వైనం తిరుమలలో వెలుగుచూసింది. ఇద్దరు దళారులు టీటీడీ ఛైర్మన్ జనరల్ సెక్రటరీమంటూ శ్రీవారి భక్తురాలిని మోసగించారు. తమిళనాడుకు చెందిన ఓ యువతి విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో పీజీ చదువుతున్నారు. సంఘమిత్ర తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఇందు కోసం టీటీడీ ఛైర్మన్ జనరల్ సెక్రటరీ అని చెప్పుకునే దీపుబాబు, పవన్ కుమార్ అనే దళారులను సంఘమిత్ర ఆశ్రయించారు.
దీంతో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఐదు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, మరో ఐదు సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి దీపుబాబు, పవన్ కుమార్ శ్రీవారి భక్తురాలిని మోసగించారు. ఆమె నుంచి ఫోన్పే ద్వారా రూ.2.60 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసి పత్తాలేకుండా పోయారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. జరిగిన ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు తిరుమలలో ప్రైవేటు హాకర్ల ఆగడాలు శ్రుతిమించాయి. శ్రీవారి ఆలయం నుంచి లడ్డూ కౌంటర్ మీదుగా మాడవీధుల్లోకి వచ్చి.. అక్కడ నుంచి బయటకు వచ్చే ప్రాంతంలో రెండు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ తాత్కాలిక మరుగుదొడ్ల వద్ద ఫ్రూట్జ్యూస్ బాక్సులు దాచి వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కొంతమంది భక్తులు గమనించారు. టీటీడీ భద్రతా విభాగం అధికారులు ఇలాంటి హ్యాకర్ల మీద చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
![]() |
![]() |