ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి మరో గుడ్ న్యూస్.. ఇక నిర్మాణ పనులు మరింత వేగంగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 05:47 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో శుభవార్త అందింది. అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11000 కోట్లు రుణం ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో)- సీఆర్‌డీఏ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11000 రుణం ఇవ్వనుంది. వాస్తవానికి అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు చేసేందుకు హడ్కో గతంలోనే అంగీకారం తెలిపింది. జనవరి 22న ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో రుణం ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. అయితే ఆదివారం హడ్కో, సీఆర్‌డీఏ మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అమరావతికి నిధులను విడుదల చేయనున్నారు.


అమరావతికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వీటికి తోడు హడ్కో ద్వారా కూడా రుణం వస్తున్న నేపథ్యంలో అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. ఈ నెలలోనే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పలు నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముగిసింది. మార్చి నెలాఖరులోగా పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. మరోవైపు మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిని మరోసారి రీలాంఛ్ చేయాలని భావిస్తున్నారు.


అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం


అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షను ప్రతిబింబించేలా.. అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే స్మారక పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు సొంతూరిలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని, ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామని ప్రకటించారు. ఇక పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఉగాది నుంచి పీ-4 విధానం ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను 12 నెలలు 12 కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com