శ్రీకాకుళం, ఫిబ్రవరి 22 : స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్ర వారం ఉదయం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అధికారి కె.నరేంద్ర ప్రసాద్, డిప్యూటి కలెక్టర్ టి.సారమ్మ, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి రమేష్ తదితరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నరసింహా రెడ్డిని 1847 ఫిబ్రవరి 22వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసిందన్నారు. నరసింహా రెడ్డి ప్రస్తుత కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించారని చెప్పారు. నరసింహా రెడ్డి భారత స్వాతంత్ర్యోద్యమకారులలో మొదటి విప్లవకారుల్లో ఒకరని పేర్కొన్నారు. మొదటి భారత స్వాతంత్ర్య తిరుగుబాటుగా చెప్పుకునే 1857 సంవత్సరానికి పది సంవత్సరాల ముందుగానే స్వాతంత్ర్య తిరుగుబాటు చేసిన వ్యక్తి అన్నారు. ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి ప్రాంతంలో గల కనీసం 60 గ్రామాలు నరసింహా రెడ్డి మాటపై నిలబడి ఉండేవారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటయోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని జాతి నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ వివిధ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.