శ్రీకాకుళం,ఫిబ్రవరి 22: శ్రీకాకుళం ఆర్.టి.సి.కాంప్లెక్ష్ ను సుందరంగా తీర్చిదిద్దటానికి మరింత కృషి చేస్తామని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శుక్రవారం ఆర్.టి.సి.కాంప్లెక్స్ లో ఆధునికరించిన మరుగుదొడ్లు,పోర్టికో లను స్థానిక శాసనసభ్యులు గుండ లక్ష్మిదేవితో కలసి ప్రారంభించారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించిన ఆయన ప్రయాణికులు ఎక్కిన బస్సును పరిశీలించి,ప్రయాణీకులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఎం.పి మాట్లాడుతూ జిల్లాలో శ్రీకాకుళం ఆర్.టి.సి.కాంప్లెక్స్ అతిపెద్దదని అన్నారు. 25 వేల మంది ప్రయాణీకులు ప్రతీ రోజు ప్రయాణిస్తూ రద్దీగా ఉండే ఈ కాంప్లెక్స్ కు అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అందులో భాగంగా ఎం.పి.లాడ్స్ నుండి రూ.40 లక్షల నిధులను మంజూరు చేసామన్నారు. ఆ నిధులతో ఆర్.టి.సి.కాంప్లెక్స్ నుండి ప్రధాన ద్వారం వరకు పోర్టికో మరియు మరుగుదొడ్లను ఆధునీకరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్.టి.సి. ఒక సంస్థ అయినప్పటికీ అత్యంత పేదవర్గాల వారికి సేవలు అందిస్తుందని అన్నారు. అటువంటి సంస్థ నష్టాల్లో ఉన్నందున చేయూతను అందించామన్నారు. ప్రధాన ద్వారం వద్ద పోర్టికో నిర్మాణం వలన ప్రయాణీకులకు వేసవి, వర్షాకాలంలో కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.అలాగే మరుగుదోడ్లను అందంగా నిర్మించుకున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ఆర్.టి.సి.కాంప్లెక్స్ ను మరింత సుందరంగా తీర్చి దిద్దుతామని అన్నారు. త్వరలో వైఫాయ్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతీ బస్సుకు డిజిటల్ డిస్ ప్లే భోర్డులను ఏర్పాటుచేయిస్తామని అన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ రిజర్వేషను పద్దతి ఉందని, అయితే అన్ని బస్సులకు ఆ సౌకర్యం వచ్చేలా చూస్తామన్నారు. ఆర్.టి.సి. కొన్ని విషయాలలో చాలా ముండడుగులో ఉందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం బస్సులను వేసి ప్రయాణీకులను ఒక చోట నుండి మరో చోటుకి సురక్షితంగా చేరవేస్తుందని తెలిపారు. నేడు ఆర్.టి.సి ఇంత అభివృద్ది చెందడానికి సంబంధిత శాఖ మంత్రి జిల్లాపై చూపిన చొరవతో సాధ్యపడిందని తెలిపారు. ఇంకా ఈ కాంప్లెక్షుకు మరిన్ని అదనపు సౌకర్యాలు సమకూర్చెందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. ఈ కాంప్లెక్ష్ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు గుండ లక్ష్మిదేవి, ఆర్.టి.సి.చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, 1,2వ డిపోల మేనేజర్లు డి. ఢిల్లీశ్వరరావు,బి.అరుణ కుమారి,పి ఆర్.ఒ బి.ఎల్.పి.రావు,సి.ఎలు అమర సింహుడు,శ్రీనివాసు,డి ఈ, ఏ.ఈలు,ఆర్.టి.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు