సాదారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉందని శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి యం.వి.రమణ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పోలీసు అధికారులు, బూత్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 23,34వ తేదీలలో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు. బూత్ స్ధాయి అధికారులు పోలింగు కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లభ్యంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా యవ ఓటర్లే లక్ష్యంగా పనిచేయాలని, ఓటర్ల నమోదు ఫారాలను కేంద్రాల వద్ద సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాదారణ ఎన్నికల్లో ఈ.వి.యంలు, వి.వి.ప్యాట్లను వినియోగిస్తున్నందున వాటిపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వీటికి సంబంధించి ప్రత్యేక శిక్షణను ఇవ్వడం జరిగిందని, ఇంకా వాటిపై అవగాహన లేనివారు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు గస్తీ ఉంటుందని, అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మరింత పటిష్ట భద్రతను ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. ఇందుకు ఇప్పటినుండే సమస్యాత్మక కేంద్రాలపై చర్చించి వాటికై చేపట్టవలసిన చర్యలపై చర్చించాలన్నారు. ముందుగా శ్రీకాకుళం శాసనసభ నియోజక వర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్న ఆయన వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉందన్నారు. సాదారణ ఎన్నికలు 2019పై రూట్ అధికారులు, జోనల్ అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకు అధికారులు చేపట్టాల్సిన అంశాలపై వివరాలు తెలియజేసారు. అనంతరం పోలింగ్ ఏజెంట్ల నియామకంపై చర్చించిన ఆయన సంబంధిత పార్టీలు అభ్యర్ధులను ఎంపికచేసుకునే అవకాశంపై అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో డి.యస్.పి కళ్యాణ చక్రవర్తి, పోలీసు అధికారులు, శ్రీకాకుళం, గార తహశీల్ధారులు, యం.పి.డి.ఓలు, ఉప తహశీల్ధారు సతీష్, బి.యల్.ఓలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.