సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఇంకా తేదీ ఖరారు కాలేదు కానీ ఏపీలో అన్ని పార్టీలు దూకుడుగా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అధికారం టీడీపీ ఇప్పటికే రాజంపేట పార్లమెంట్ స్థానంపై సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈరోజు కర్నూలు పార్లమెంట్ స్థానంపై సమీక్ష జరగనుందని సమాచారం. ఈ సమీక్షలోనే కర్నూలు పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే మాజీ మంత్రి కోట్ల పార్టీలో చేరనుండగా అనంతరం పూర్తి స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు పరిధిలోని పత్తికొండ, ఎమ్మిగనూరు స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకోగా వచ్చే ఎన్నికలకు గట్టి వ్యూహాలతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. కర్నూలు పరిధిలోని పత్తికొండ నియోజకవర్గానికి కేఈ శ్యామ్, ఎమ్మిగనూరు-జయనాగేశ్వరరెడ్డి, ఆదోని – మీనాక్షి నాయుడు, కర్నూలు – ఎస్వీ మోహన్రెడ్డి, ఆలూరు అభ్యర్థిగా సుజాతమ్మ పేర్లు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుండగా కోడుమూరు, మంత్రాలయం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కోట్ల చేరిక తర్వాత పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.