కాకినాడ : రాష్ట్ర ప్రజలకు సులభతరంగా సేవలందించడంతో పాటు పట్టణాలను మరింత అభివృద్ధి చేయడానికే గుడా ఏర్పాటైందని, అందువలన సమస్యలు, అపోహలు,సందేహాలు ఏమైనా ఉంటే ఓపెన్ ఫోరమ్ ద్వారా పరిష్కరించుకోవాలని గుడా చైర్మన్ గన్ని కృష్ణ కోరారు. గుడా కార్యాలయంలో శుక్రవారం ఓపెన్ ఫారమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ, వైస్ చైర్మన్ డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్ గట్టి సత్యనారాయణలు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సందేహాలకు, సమస్యలకు పలు సూచనలు చేశారు. గుడా ద్వారా అందించే సేవలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, అభివృద్ధి, ప్రజలకు సేవలందించే విషయంలో గుడా ముందుందని చైర్మన్ అన్నారు.ఈ కార్యక్రమంలో గుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జి.రాంకుమార్, కార్యదర్శి ఎ.సన్యాసిరావు, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్లు సత్యమూర్తి, వెంకట కృష్ణ, శాంతిలత, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.