న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భారత్కు షాకిచ్చింది. ఇద్దరు పాకిస్థాన్ షూటర్లకు వీసా నిరాకరించిన కారణంగా భవిష్యత్తులో ఎలాంటి ఈవెంట్ ఇండియాలో నిర్వహించకుండా నిషేధం విధించింది. ఇతర అంతర్జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్స్కు కూడా ఇండియాలో ఈవెంట్స్ నిర్వహించవద్దని సూచించింది. పుల్వామా దాడి నేపథ్యంలో ఇద్దరు పాకిస్థాన్కు చెందిన షూటర్లకు భారత్ వీసా నిరాకరించింది. ఈ ఇద్దరు షూటర్లు ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ వరల్డ్కప్లో పాల్గొనాల్సి ఉంది. అయితే పోటీల్లో పాల్గొనాల్సిన వారికి వీసాలు ఇవ్వకపోవడం తమ నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఐఓసీ స్పష్టం చేసింది. వివక్ష, రాజకీయ జోక్యాన్ని సహించబోమని తేల్చి చెప్పింది. చివరి నిమిషం వరకూ భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఇండియాలో జరగబోయే ఈవెంట్లో పాల్గొనడానికి పాకిస్థాన్ టీమ్కు అవకాశం దక్కలేదు. అందువల్ల ఇకపై భారత ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవు. భవిష్యత్తులో ఎలాంటి స్పోర్టింగ్ ఈవెంట్స్ ఇండియాలో జరిపే అవకాశం లేదు అని ఐఓసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. అథ్లెట్లు అందరికీ వీసాలు ఇస్తామని భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని చెప్పింది.