బిజెపి రక్తంలోనే దేశభక్తి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా చెప్పారు. రాజమహేంద్రవరంలో ఐదు నియోజక వర్గాల కార్యకర్తలతో అమిత్షా నేడు భేటీ అయ్యారు. చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తీవ్రమైన విమర్శలు చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయి, మాజీ సీఎం ఎన్టీఆర్ను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.అభివృద్ధి నిధులను టీడీపీ అవినీతిమాయం చేసింది. ఇప్పుడు ప్రధాని మోదీని మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, జగన్ వల్ల ఏపీ అభివృద్ధి కాదని, మోదీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పాలన పార్టీలంటూ మండిపడ్డారు. అమిత్ షా పుల్వామా ఘటనపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబుకు పాక్ ప్రధానిపై ఉన్న నమ్మకం.. మన ప్రధానిపై లేదని ధ్వజమెత్తారు. ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని అమిత్షా మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్తో చంద్రబాబు కలిసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.