హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న రైతు బంధు పథకం తరహాలోనే .. మోదీ సర్కార్ కూడా రైతుల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద.. దేశంలోని పేద రైతులకు ఆర్థికసాయం చేయనున్నారు. 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారికి పంట సాయం అందించనున్నారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను.. ఈనెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన ఈ స్కీమ్ను ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందే రైతులకు.. ఆ రోజు నుంచి వారి ఖాతాలో మొదటి విడుతాగా రెండు వేలు జమ చేయనున్నారు. ఈనెల 24వ తేదీన సుమారు కోటి మంది చిన్న, సన్నకారు రైతులకు తమ బ్యాంకు ఖాతాల్లో మొదటి విడుత డబ్బును ప్రభుత్వం జమ చేయనున్నది. మార్చి 31వ తేదీ లోగా దేశవ్యాప్తంగా సుమారు రెండున్నర కోట్ల మంది రైతుల ఖాతాల్లో పంట సాయాన్ని జమ చేస్తారు. చిన్నకారు రైతుల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు.. చిన్నరైతుల జాబితాను కేంద్రానికి పంపింది. ఏప్రిల్ ఒకటి తర్వాత రెండవ విడుత పంపిణీ జరుగుతుంది. ఏడాదికి 75వేల కోట్లతో కిసాన్ సమ్మాన్ నిధి బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.