అమరావతి: నేరస్థులతో పోరాటం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా నేతలకు దిశానిర్దేశం చేశారు. నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. వివిధ మార్గాల్లో దుష్ప్రచారం చేస్తారన్నారు. హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతి ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ అని, నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబం అని సీఎం దుయ్యబట్టారు. ప్రత్యర్థుల నేరచరిత్ర గుర్తుంచుకొని, ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు వారీగా సమీక్షలు చేస్తున్నామన్నారు. నాలుగు ఎంపీ సీట్లలో ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు, ఏరియా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. సమీక్షల సందర్భంగా వీరితో స్వయంగా సీఎం భేటి అవుతారని తెలిపారు. తెదేపా గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. అందరికీ జవాబుదారీతనం ఉండాలన్నారు.