రాష్ట్రంలో ముస్లీంలకు ధామాషా ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుందని, సమాజ సేవ చేయాలనే ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జలీల్ అన్నారు. మహాత్మాగాంధీరోడ్డులోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న మీడియా హౌస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడుతూ ధనం, కులం, మతం, అవినీతి ప్రభావం లేని రాజకీయం దేశానికి అవసరమని తెలిపారు. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, నిరుద్యోగ, బహుజన, గిరిజన, ముస్లీం, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కేవలం ధనికులను మాత్రమే పరిగణంలోకి తీసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని దేశంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తమ పార్టీకి కత్తెర గుర్తు కేటాయించిందని తెలిపారు. స్వచ్చమైన పాలన అందించే దిశగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే అన్ని స్థానాల్లో పోటీ చేయడంలో భాగంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. దేశంలో ముస్లింలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనానికి గురయ్యారన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు నవరంగ్ కాంగ్రెస్ పార్ట్ ధామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తుందన్నారు. నేటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అందుకు యువతను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ సైదా, నగర ఇన్ఛార్జ్ అబ్దుల్ అన్సారీ బేగ్, జాతీయ అధ్యక్షుడు షేక్ ఆరీఫ్, నగర అధ్యక్షుడు ఖాన్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.