ప్రతిఒక్కరూ విద్యార్థి స్థాయి నుండే వ్యక్తిగత నైపుణ్యాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకోవాలని ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నియమితులైన సీఈవో దుర్గాప్రసాద్, సీఏఓ సుమితా అన్నారు. నూతనంగా బాద్యతలు చేపట్టిన అనంతరం బుధవారం కళాశాలలో వారు విద్యార్థులు, అధ్యాపకులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈవో దుర్గాప్రసాద్, సీఏఓ సుమితా మాట్లాడుతూ కళాశాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు సాగేందుకు కళాశాల అభివృద్ధికి రూపొందించి ప్రత్యేక భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అధ్యాపకులకు పలు మార్గదర్శక సూత్రాలను వివరించారు. నూతన విద్యాబోధన పద్దతులు పూర్తిస్థాయిలో ప్రయోగశాలలను అతిత్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ముఖ్యంగా వివిధ సబ్జెక్టులతో పాటు విషయపరిజ్ఞానంతో ముందుకు సాగేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. వారికి భాషా పరిజ్ఞానం, నైపుణ్యత, కార్యదక్షత, క్రమశిక్షణ, నూతన సంస్కరణలు అలవాటు చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇతరులకు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలో వివరిస్తూ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాలలోని క్రీడా మైదానాన్ని పరిశీలించడంతో పాటు దాని అభివృద్ధిపై అధ్యాపకులు, విద్యార్థులతో సమీక్షించారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.