రాష్ట్ర విభజన తర్వాత అండగా ఉంటామన్న కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి చేసిన కృషికిగాను ఉద్యోగుల సంఘం నేతలు చంద్రబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ..‘‘ ఉద్యోగుల ప్రతి సమస్యను సానుకూలంగా పరిష్కరించా. ఉద్యోగులకు అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చాను. అడిగిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాను. ప్రతి ఉద్యోగికి సొంతింటి కల నెరవేరేలా చేశాం. అమరావతిలో ఉన్నటువంటి సచివాలయం మరెక్కడా లేదు. ప్రజలతో పాటు ఉద్యోగులకూ న్యాయం చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి 670 అవార్డులు వచ్చాయి. అరవై ఏళ్ల శ్రమను హైదరాబాద్లోనే వదిలేసి వచ్చాం. మళ్లీ తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలి. ఈనాలుగేళ్లలో లోటు వర్షపాతం, తుపానులు కొంత అవరోధంగా మారాయి. ఆంధ్రప్రదేశ్కు పట్టణీకరణ తక్కువగా ఉన్నందున ఆదాయం తక్కువగా వస్తోంది. అందరికంటే ఎక్కువ పరిజ్ఞానం మనకు ఉంది.10.5 శాతం అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’’ అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.