ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ భృతి పొందుతున్న యువతలో, ప్రతి ఒక్కరికీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 4,46,834 మంది నిరుద్యోగ భృతికి అర్హత పొందారని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. ఎస్. రావత్ వెల్లడించారు. ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి కింద రూ.155 కోట్లు చెల్లించినట్టు ఆయన తెలిపారు.ఇప్పటికే 40,941 మంది పలు కోర్సుల ద్వారా నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్నారని, మరో 6 వేల మంది శిక్షణలో ఉన్నారని సీఎస్ కు వివరించారు. ప్రతి ఒక్కరికీ నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు, వారికి ఉద్యోగాలు లభించేలా పరిశ్రమలతో సంప్రదింపులు జరపాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. మార్చి 1వ తేదీ నుంచి నిరుద్యోగుల భృతి రూ.2000 చెల్లించనున్నట్టు ఆర్థికశాఖ కార్యదర్శి పియూష్ కుమార్, సీఎస్ అనిల్ చంద్ర పునేఠాకు తెలిపారు. నిరుద్యోగులు కోరుకునే అన్ని కోర్సుల్లో నైపుణ్యాభివృద్దిలో శిక్షణ ఇవ్వాలని సీఎస్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.