అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టీమ్ ఇండియా స్ఫూర్తితో పని చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తిరుపతి విమానాశ్రయ రన్ వే విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన, తిరుపతి అభివృద్ధి క్రమంలో ఇదో శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది తరలివ వచ్చే నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా తిరుపతి లాంటి నగరాల అభివృద్ధి ఆర్థిక పర్యాటక రంగాలకు ఊతమిస్తాయని, దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. విమానయానం అభివృద్ధి పారిశ్రామిక, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి దారి చూపుతుందన్న ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ లో విమానయానం మహర్ధశ దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. తిరుపతి విమానాశ్రయ అభివృద్ధి కోసం సహకారం అందిస్తున్న కేంద్ర పౌరవిమాన యాన మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాతో పాటు మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, విమానాశ్రయ అభివృద్ధి కోసం భూమిని అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
తిరుపతి వాసులు అదృష్టవంతులు-
కేంద్రప్రభుత్వం దృష్టి సారించిన నగరాల్లో తిరుపతి మొదటి వరుసలో ఉందని తెలిపిన ఉపరాష్ట్రపతి తిరుపతిని స్మార్ట్ సిటీగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నారని, విమానాశ్రయంతో పాటు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు అనేక కేంద్ర విద్యా సంస్థలు తిరుపతి ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయని, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఈఎస్ఆర్ తో పాటు పాకశాస్త్ర నైపుణ్య (కలనరీ) బోధనా సంస్థ, రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్ లాంటి ఎన్నో సంస్థలు తిరుపతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే తిరుపతి ఎంతో అభివృద్ధి చెందిందని, స్వచ్ఛత విషయంలో తిరుపతి నగరం అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడుతోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా, చిత్తూరు జడ్పీ ఛైర్ పర్సన్ శ్రీమతి గీర్వాణి చంద్ర ప్రకాష్ పాల్గొన్నారు.