సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై టిటిడి అందిస్తున్న పంచలోహ విగ్రహాలపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పరిశీలన జరగాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని ఆలయాలకు టిటిడి రాయితీపై పంచలోహ విగ్రహాలు అందించింది, ఎన్ని ఆలయాలలో విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు, తదితర సమాచారంపై హెచ్డిపిపి ఆధ్వర్యంలో పరిశీలన నిర్వహించాలని, తద్వారా మరిన్ని ఆలయాలకు విగ్రహాలు అందించవచ్చునని అన్నారు. సప్తగిరి మాస పత్రికను సకాలంలో పాఠకులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా చందాదారుల చిరునామా, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడిలు తదితర వివరాలను ఆన్లైన్లో అప్డేట్ పూర్తి చేయాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంలో భక్తులు ఆన్లైన్లో వసతి పొందేందుకు అవసరమైన ఏర్పాట్లను వారంలోపు పూర్తి చేయాలన్నారు. పద్మావతి నిలయం వద్ద పచ్చదనం పెంపొందించడానికి విరివిగా మొక్కలు నాటాలన్నారు.
టిటిడి స్థానిక ఆలయాలలోని హుండీలకు సంబంధించిన తాళం చెవులు సంబంధిత ఆలయ ఉన్నతాధికారుల వద్ద ఉండాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఉన్న సమాచార కేంద్రాలలో ఉన్న హుండీల తాళాలు ఏఈవోల వద్ద ఉండేల చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి అనుబంధ ఆలయాలలో సమర్పణ రిజిష్టర్, కానుకల రిజిష్టర్, పడికావిలి రిజిష్టర్లను విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద ఉన్న మ్యూజియంను, ఆలయంకు వెనుక వైపు గల పాత హూజురు ఆఫీసులోనికి మార్చడానికి స్థల పరిశీలన చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాబోవు 2020 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులకు దేశంలోని వివిధ ప్రాంతాలలోని టిటిడి సమాచార కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
అనంతరం టిటిడి స్థానిక ఆలయాల అభివృద్ధి కొరకు నియమించిన ప్రత్యేక అధికారులు, డెప్యూటీ ఈవోలు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయా ఆలయాల అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై జెఈవో సమీక్షంచారు.