తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.
ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 8.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఊంజల్సేవ చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9.00 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.