టైలర్ల సమస్యల పరిష్కారానికి భారతదేశంలోనే మొదటిసారిగా ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ ఆకాశపు స్వామి కృతజ్ఞతలు తెలిపారు. రెడీమేడ్ రంగం వల్ల దర్జీలకు సగం రోజులు పనిలేకుండా పోతోందని వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని సచివాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆకాశపు స్వామి వెల్లడించారు. దర్జీలకు వంద యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని, 50 సంవత్సరాలకే ఫించను, రాయితీపై మెటీరియల్ సరఫరా, దర్జీలకు ప్రభుత్వ రాయితీతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి సీఎం అంగీకరించారని స్వామి తెలిపారు. ఆధునిక కుట్టుమిషన్లతో టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసేందుకు కూడా సీఎం అంగీకరించినందుకు ఫెడరేషన్ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దర్జీల సంక్షేమం కోసం త్వరలో ఫెడరేషన్ కు తగినన్ని నిధులు కేటాయించేందుకు సీఎం అంగీకరించారని స్వామి తెలిపారు. సీఎం చంద్రబాబును మరలా గెలిపించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృత్తిపై 11 లక్షల మంది జీవిస్తున్నారని యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు గుర్తుచేశారు. దర్జీ వృత్తి అంతరించిపోకుండా రాయితీతో ఆధునిక పరికరాలు సరఫరా చేయాడానికి సీఎం అంగీకరించినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.