పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్పై సైబర్ పోలీస్స్టేషన్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కోరాడ విజయ్కుమార్, కోగంటి సత్యం మంగళవారం ఫిర్యాదు చేశారు. వైసీపీ పశ్చిమ సీటు కోసం వెలంపల్లితో పాటు కోరాడ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా కోరాడ విజయ్కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోరాడ విజయ్కుమార్, కోగంటి సత్యం మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తమను ఎదుర్కోలేని వెలంపల్లి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత మూడు రోజులుగా కోరాడ చిట్స్ బోర్డు తిప్పేస్తుందంటూ వాల్పోస్టర్లు , సోషల్ మీడియాలో వెలంపల్లి యూత్ పేరుతో దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తమను, తమ వ్యాపారాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్న వెలంపల్లిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. పదవుల కోసం పూటకో పార్టీ మార్చే వెలంపల్లికి తమ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని మండిపడ్డారు. ఆధారాలతో సహా అన్ని వివరాలు పోలీసులకు ఇచ్చామని కోరాడ విజయ్కుమార్ తెలిపారు. వెలంపల్లి యూత్ పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని అరికట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.