ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులు తక్షణమే తమకు బదిలీ అయిన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ హెచ్చరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో 13 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 7 జిల్లాల్లో పలువురు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్.ఓ., ఏ.ఆర్.ఓ.లు తమకు బదిలీ అయిన ప్రాంతాల్లో విధుల్లోకి చేరలేదని సీఎస్ దృష్టికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తీసుకొచ్చారు. దీనిపై సీఎస్ అనిల్ చంద్ర పునేఠ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి విధుల్లో చేరాలే చూడాలని, అప్పటి వారు స్పందించకపోతే కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ను ఆదేశించారు. బుధవారం సాయంత్రంలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 7 జిల్లాల్లో బదిలీ అయిన వారంతా తమకు కేటాయించిన విధుల్లో చేరాల్సిందేనని స్పష్టం చేశారు.