పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన టికెట్ల కోసం అనేకమంది ఆశావాహులు దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల అర్హతలు తెలుసుకునేందుకు పరీక్షలు కూడా జనసేన పార్టీ... వారి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా అంతా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే అని నిబంధనను రూపొందించింది. ఓ వైపు రాజకీయ నేతలను పార్టీలోకి చేర్చుకుంటూనే... మరో వైపు కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో జనసేనలో చేరిన మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు... ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా టికెట్ కోసం ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. మంగళవారం పార్టీ స్క్రీనింగ్ కమిటీ ముందు 150 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని... వారిలో క్రికెటర్ వేణుగోపాల్ రావు కూడా ఉన్నారని తెలిపింది. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా టికెట్ కోసం దరఖాస్తు జనసేన ప్రకటించింది. మరి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వేణుగోపాల్ రావుకు జనసేన టికెట్ ఇస్తుందా ? ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అన్నది చూడాలి.