ఏడు బలమైన సిద్ధాంతాలు కలిగిన జనసేనపట్ల తమకు నమ్మకం ఉందనీ... ఈ సిద్ధాంతాలపై నిబద్ధతతో ఉన్న పవన్ కల్యాణ్ గా ద్వారానే పాలనలో మార్పు వస్తుందని విశ్వసిస్తున్నామని జనసేన అభ్యర్థిత్వం కోసం వచ్చిన ఆశావహులు చెబుతున్నారు.
గిరిజన, ఎస్సీ హక్కుల కోసం పోరాడినవారు, భూసేకరణ అమలులో లోపాలపై న్యాయపోరాటాలు చేసినవారు జనసేన అభ్యర్థిత్వం కోరుతూ స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగితే పోరాటం చేసిన గిరిజన నేతలు కూడా వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల తరఫున, ఆ ప్రాంతంలోని ఎస్టీల పక్షాన నిలిచిన నాయకులు ఆ ప్రాంతంలో జనసేన పక్షాన నిలుస్తామని బయో డేటాలు ఇచ్చారు. అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి నలుగురు పాత్రికేయులు బయో డేటాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ 10 మంది జర్నలిస్టులు బయో డేటాలు ఇచ్చారని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు తెలియజేశారు. భారత రక్షణ దళంలో సేవలందించి విరమణ తీసుకున్న సైనికాధికారులు, సైనికులు జనసేన అభ్యర్థిత్వం కోసం వచ్చారు. వీరిలో కమెండో ఆపరేషన్స్ లో పాల్గొన్న ఓ విశ్రాంత అధికారి ఉన్నారు. ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగినప్పుడు నిర్వహించిన కమెండో ఆపరేషన్స్ లో ఈయన పాల్గొన్నారు.