అబ్కారీ విధానాలకు సంబంధించి ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును పూర్తి స్ధాయిలో విచారణ చేయవలసిందేనని, దానికి సంబంధించిన విచారణ నివేదికను సైతం తిరిగి వారికి అందుబాటులో పొందుపరచాలని రాష్ట్ర మద్యనిషేదము, అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఫిర్యాదులకు సంబంధించి విభాగ పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామన్నది వారికి తెలియచెప్పటం కూడా కీలకమైన అంశమని అభిప్రాయపడ్డారు. మంగళవారం విజయవాడ రూరల్, ప్రసాదంపాడులోని అబ్కారీ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదుల నిర్వహణ విధానంపై ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపధ్యంలో మీనా పలు అదేశాలు జారీ చేస్తూ రానున్నది ఎన్నికల సమయం కాగా, సిబ్బంది పూర్తి స్ధాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రత్యేకించి ఈ సమయంలో వచ్చే ఫిర్యాదులను సాదాసీదాగా తీసుకోరాదని స్పష్టం చేసారు. కేవలం ఎన్నికల ఫిర్యాదుల కోసమే రాష్ట్ర స్ధాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఫిర్యాధుల పరిష్కార విభాగానికి పూర్తి స్ధాయిలో జవసత్వాలు కల్పించాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఎప్పటి కప్పడు అవసరమైన సమాచారం రాష్ట్ర కార్యాలయానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి కాలపరిమితి తప్పనిసరని, ఎటువంటి ఫిర్యాదు అయినా 48గంటల వ్యవధిలో పరిష్కారం కావలసిందేనని మీనా అధికారులకు స్పష్టమైన అదేశాలు జారీ చేసారు. రోజువారి నివేదికలలో సైతం మరింత స్పష్టత ఉండేలా పలు మార్పులు చేసారు. రాష్ట్ర స్ధాయిలో అన్ని అంశాలతో కూడిన ఏకీకృత నివేదికతో పాటు, జిల్లాస్ధాయిలో కూడా అదేతీరుగా ఒక నివేదిక తయారు కావాలన్నారు. బెల్టు షాపులు, ఐడి పార్టీల దాడులు, మొబైల్ పార్టీ పనితీరు వంటి అంశాలపై కూడా రోజువారి నివేదికలు అవసరమని, మరోవైపు ఎన్నికల సంఘం కోరిన ఫార్మెట్లో నివేదికలు ఉండాలని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. నేరాలకు సంబంధించి జిల్లాల మధ్య పోలికను చూపుతూ సమాచారం సిద్దం కావాలన్నారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ సగటు ప్రజలు ఎవరైనా మద్యం విక్రయాలకు సంబంధించి తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. సాధారణ రాత పూర్వక ఫిర్యాదుతో పాటు ఈ మెయిల్, టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ యాప్, వెబ్, తపాళా తదితర ఏవిధానంలోనైనా తాము ఫిర్యాదు స్వీకరించి తీసుకున్న చర్యలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదు అందిన తదుపరి తక్షణమే గంటల వ్యవధిలో స్పందించేలా తమ ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు.