ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ, సినీ ప్రముఖుల అడుగులు లోటస్ పాండ్ వైపు పడుతున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరారు. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్తో భేటీ అయిన విషయం తెలిసిందే. శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీలో చేరినట్లు వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, మర్యాదపూర్వకంగానే జగన్ను కలిసినట్లు నార్నె చెప్పారు. తాజాగా మంగళవారం హీరో నాగార్జున కూడా వైసీపీ అధినేత జగన్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాగార్జున జగన్ను కలవడం రాజకీయం చర్చనీయాంశంగా మారింది. జగన్ను కలిసిన నాగ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. నాగార్జున జగన్తో భేటీ అవడానికి కారణాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నాగార్జున వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు నుంచి పోటీ చేస్తారని కొందరు.. గుంటూరు ఎంపీ సీటు తన సన్నిహితుడికి ఇవ్వాలని కోరినట్లు ఇంకొందరు చెప్పుకుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో నాగార్జున పోటీ చేస్తున్నారా? లేక తనకు కావాల్సిన వారిని అక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారా? అని ఆసక్తి నెలకొంది.