తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి సభ్యులను తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీలు అడ్డుకున్నారు. మంగళవారం తిరుమలలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశంలో స్థానిక సమస్యలను చర్చించే విషయాన్ని ఎజెండాలో పెట్టకపోవడం పట్ల టీడీపీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, పార్లమెంటు సభ్యుడు ఎన్.శివప్రసాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో సమస్యలను పరిష్కరించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సమావేశ మందిరం ఎదుట అధికార టీడీపీ నేతలు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు లోక్ సభ సభ్యుడు శివప్రసాద్, తుడా చైర్మన్ నర్సింహ యాదవ్ టీటీడీ బోర్డు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సమావేశం అజెండాలో ఈరోజు స్థానిక సమస్యలను చేర్చకపోవడంపై మండిపడ్డారు. టీటీడీ బోర్డు సభ్యులను సమావేశానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని బైఠాయించారు. దీంతో స్థానిక సమస్యలపై కూడా చర్చిద్దామని టీటీడీ బోర్డు సభ్యులు హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. దీంతో ఆలయ, పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి