ఏపీ భవన్ వీఐపీ కాంటీన్ లో ఇవాళ ‘‘అపనీ బాత్ రాహుల్ కే సాత్’’ కార్యక్రమం జరిగింది. ఏడుగురు చిన్న మధ్యతరహా పారిశ్రామికరంగ వ్యాపారవేత్తలతో ఎఐసీఅసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. మొబైల్, చేనేత, ఆటో మొబైల్, శానిటరీ పాడ్స్, టూరిజం, హోటల్, సోలార్ ఏసీ, ఇకో సిల్క్ రంగాల చిన్న తరహా పారిశ్రామికవేత్తలతో రాహుల్ చర్చించారు. రంగాల వారీగా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను, సూచనలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. రాహుల్ ఆంధ్రా భోజనం చేస్తూ వ్యాపారుల నుంచి రంగాల వారీగా ఉన్న సమస్యలు, పరిష్కారాలు, సలహాలను తీసుకున్నారు. రాహుల్ గాంధీతో సమావేశం ఆనందాన్ని కలిగించిందని వ్యాపారులు తెలిపారు. భారత భవిష్యత్తు నాయకుడు రాహుల్ గాంధీ అని వ్యాపారులు కొనియాడారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున తీసుకోవాల్సిన విధానాలు, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై రంగాల వారీగా ప్రజలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యార్థులతో సమావేశమై విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లు, విద్యాప్రమాణాలపై సలాహాలు విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్నారు.