కునిగల్: కర్నాటకలోని చికమగులూరు ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన తుమకుర్ జిల్లాలోని కునిగల్ పట్టణం వద్ద జరిగింది. మృతిచెందిన వారు ఉడిపిలో కొల్లూరు ఆలయాన్ని సందర్శించి.. బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మూత్రవిసర్జన చేసేందుకు రోడ్డు పక్కన నిలుచున్న వారిని ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రవితో పాటు మరో నలుగురు గాయపడ్డారు. కారులో ఎమ్మెల్యే ఎడమ వైపున కూర్చున్నారు. కర్నాటక బీజేపీ పార్టీ కార్యదర్శిగా కూడా రవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే రవి కారు నడపడం లేదని కొందరంటున్నారు. కునిగల్ పోలీసు స్టేషన్లో కేసును నమోదు చేశారు.