మార్చి ఒకటవ తేదీన భారతీయ జనతా పార్టీ తలపెట్టిన విశాఖపట్నం బహిరంగ సభకు, తమ మైదానాన్ని ఇవ్వలేమని ఆంధ్రా యూనివర్శిటీ పేర్కొంది. 1న ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి రానుండగా, భారీ సభను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయాలని బీజేపీ శ్రేణులు భావించాయి. ఈ మేరకు మైదానాన్ని ఇవ్వాలని వర్శిటీ అధికారులను బీజేపీ నేతలు సంప్రదించారు. అయితే, మైదానాన్ని తాము ఇవ్వలేమని చెబుతూ, విశ్వవిద్యాలయం పాలకులు బీజేపీకి ఓ లేఖను రాశారు. మైదానం ఇవ్వలేకపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం.