వాటర్ బడ్జెటింగ్ ఒక మంచి కార్యక్రమమని, భూగర్భ జలమట్టాలపై అవగాహన పెంచడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జల చైతన్యంలో, రైతాంగానికి సాధికారత కల్పించడంలో, నైపుణ్యాభివృద్ధికి జలవనరుల శాఖ చేసిన కృషికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు లభించడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రౌండ్ వాటర్ రీచార్జిలో అనంతపురము జిల్లాకు మొదటి స్థానం, నదుల పునరుజ్జీవనంలో కర్నూలు మొదటి స్థానం, వాటర్ రీచార్జిలో విశాఖ రెండో స్థానం, రివైవల్ ఆఫ్ వాటర్ విభాగంలో కడప జిల్లా మొదటి స్థానం లభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ జలవనరుల శాఖ కృషికి ఇది మంచి గుర్తింపు అని, ఈ అవార్డులు మరింత బాధ్యతను పెంచుతున్నాయని అన్నారు. కాగా ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ఇండియా ప్రకటించిన ఈ అవార్డును ఢిల్లీలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తరపున జాయింట్ డైరెక్టర్ వరప్రసాదరావు, భూగర్భజలవనరుల శాఖ జాయింట్ డైరెక్టర్ నల్లూరి శ్రీనివాస్ లు స్వీకరించారు. ఢిల్లీలో పెట్రో-కోల్ కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును అందజేశారు. ఈ సదస్సులో మనదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, హెచ్.పి.సి.ఎల్. ఎన్.టి.పి.సి, పి.సి.ఎల్ పాల్గొన్నాయి.