రాయలసీమకు కృష్ణాజలాలు దశాబ్దాలుగా కలగా మిగిలాయని, సీమ వాసుల కలలను తాము నిజం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం-ప్రాధాన్యతా ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి 88వ సమీక్షను ప్రారంభిస్తూ పోలవరం ప్రాజెక్టును 66% పూర్తిచేసిన అధికారులను అభినందించారు. లక్ష్యం మేర పనుల పూర్తికి వేగం పెంచాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాల చేరికతో జిల్లా వాసులు సంతోషంగా ఉన్నారని, అనేక ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో చిత్తూరుకు మార్చి 15న నీరు తీసుకెళతామన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు, కుప్పం, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరుల్లో జలసిరికి హారతి ఒకే రోజు జలసిరికి హారతి ఇస్తామని, ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మదనపల్లికి ఇక రోజూ తాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెరువులన్నీ నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పుంగనూరు చెరువుకు మంగళవారం నీరు విడుదల చేస్తామని అధికారులు వివరించారు. అలాగే కుప్పం బ్రాంచి కెనాల్ కు రేపు నీరువిడుదల చేయాలని, పలమనేరు చిన్న చెరువు నింపాలన్నారు.