విజయవాడలో ఆటోమొబైల్ అసోసియేషన్ హాల్ ఆదివారం ఉదయం ఖురాన్ కంఠస్థం పోటీల్లో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థుల ఆలాపనతో మారుమ్రోగింది. సుమారు 8వేల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు హాజరయ్యారు. ఫైనల్స్లో 2 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ చాటారు. నిర్వాహకులు 6 బృందాలుగా ఏర్పడి ఉదయం 8 గంటలు నుండి పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ చైర్మన్ ఎండి దావూద్ మాట్లాడుతూ సోషల్ మీడియా మరియు వీడియో గేమ్స్తో చిన్నారులు వారి భవిష్యత్ నాశనం చేసుకోవటం బాధాకరమన్నారు. పిల్లలను భక్తి మార్గం చూపి వారిని బాధ్యతతో కూడిన జీవితానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. జమాత్ ఇస్లాం హింద్ ఎపీ కార్యనిర్వహక అధ్యక్షుడు రఫిక్ మాట్లాడుతూ గడచిన కొన్నేళ్లుగా నిర్వాహకులు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినదనీయం అన్నారు. ప్రస్తుతం నేటి తరుణంలో పిల్లలు టీవీలకు, ఫోన్లకు బానిసలుగా మారకుండా వారికి మానవ సంబంధాలు, నైతిక విలువల వికాసానికి, సమాజం పట్ల గౌరవ భావం పెరగటానికి ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. జమాత్ ఇస్లాం హింద్ మీడియా ఇంచార్జి అక్బర్ బాషా మాట్లాడుతూ ఖురాన్లో మానవుని యెక్క జీవనశైలి ఎలా ఉండాలో స్పష్టంగా తెలియజేయటం జరిగిందన్నారు. ఇది కేవలం ముస్లిం సమాజం కొరకు మాత్రమే కాదనీ యావత్ మానవాళి కోసం అని సృష్టికర్త అల్లహ పంపిన అంతిమ గ్రంధం అని తెలిపారు. ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజనాల బాబ్జి మాట్లాడుతూ గడచిన కొన్నేళ్లుగా తమ సభ్యులందరూ పూర్తి అంకితభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమనికి ముఖ్యఅతిధి పాల్గొన్న తెలంగాణ, ఏపీ పూర్వ అధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ అన్వర్ విజేతలకు బహుమతులు అందజేశారు. సెమీ ఫైనల్ నుండి ఫైనల్కి వచ్చిన 500 మంది విద్యార్థులకు రూ.5వేలు చొప్పున నగదు బహుమతి మరియు మిగిలిన ఆరు గ్రూపుల్లో ముగ్గురు చొప్పున రూ.45 వేలు అందజేశారు.