ఏపీ పోలీస్ శాఖ తరఫున ప్రజలకు భద్రత, చట్టపరమైన న్యాయం, మెరుగైన సేవలు అందించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 109 క్రైమ్ స్పాట్ వాహనాలను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. వాటిలో విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్కు కేటాయించిన ఆరు వాహనాలను పోలీస్ కమీషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ క్రైమ్ స్పాట్ పేరుతో ప్రవేశపెట్టిన నేరస్థల పరిశీలనా వాహనాలు ప్రతి సబ్ డివిజన్లో అందుబాటులో ఉంటాయని, ఏదైనా నేరం జరిగిన వెంటనే క్లూస్ టీం త్వరగా చేరుకుని లైవ్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పర్యవేక్షణ చేసి ఆన్లైన్ ద్వారా ఇందులో సిబ్బంది గైడెన్స్ ఇవ్వడం ద్వారా నేరానికి సంబంధించిన ఆధారాలు త్వరితగతిన సేకరించి కేసును ఛేదించి నేరానికి పాల్పడిన నేరగాళ్ళను పట్టుకోవడం జరుగుతుందన్నారు. సుజికీ ఇర్టిగా వాహనాలను అధునాతన సాంకేతిక పరికరాలను సమకూర్చి నగరానికి అందించడం జరిగిందన్నారు. ఈ వాహనాల్లో నేరస్థలంలో భౌతిక సాక్ష్యాధారాలను విశ్లేషించడం, నిర్ధారించడం మరియు సేకరించుటకు వివిధ రకాల పరికరాలతో కూడిన కిట్లను, వీడియో, ఫొటో కెమెరాలు, యు.వి.లైట్స్, నార్కొటిక్, ఎక్స్ప్లోజీవ్ డిటెక్టర్ వంటి సాంకేతిక పరికరాలను అమర్చి ఉంటాయని తెలిపారు. ప్రతి క్రైమ్ స్పాట్ వాహనంలో పనిచేసే పోలీస్ సిబ్బందికి సాక్ష్యాధారాలు సేకరించడం మరియు సంరక్షించటంపై ఫోరెన్సిక్ సైన్స్ బృందం ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నగరంలో దొంగతనం, దోపిడి, హత్యలు తదితర నేరాలు జరిగిన వెంటనే క్రైమ్ స్పాట్ బృందాలు నేరస్థలానికి త్వరితగతిన చేరుకుని నేరస్థలంలో భౌతిక సాక్ష్యాధారాలను సేకరించి దర్యాప్తు అధికారికి సహకారం అందిస్తారని పేర్కొన్నారు. నేరస్తులను గుర్తించడంలోను కోర్టులో నిందితులకు శిక్షలు పడే విధంగా చేయడంలోను శాస్త్రీయ ఆధారాలు కీలకపాత్ర వహించడంలో ఎంతగానో దోహదపడతాయని ఆయన వెల్లడించారు.