రాబోయే 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ప్రకటించారు. సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా దేశంలో నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలవడమేకాకుండా 137 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకూ అందిస్తున్న ఉచిత విద్యుత్ కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లను వెచ్చిస్తోందన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ముందు ఏపీలో 22 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయగలిగామన్నారు. వ్యవసాయానికి 7 గంటల నిరాటంకంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించామన్నారు. నెల రోజుల నుంచి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నందుకుగానూ రైతుల తరఫున డిస్కమ్ లకు ఏటా రూ.7 వేల కోట్ల మేర ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 19 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 100 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు వెచ్చిస్తోందని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. రూ.40 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న అక్వా రంగాన్ని మరింత ప్రోత్సాహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. ఆ రంగానికిచ్చే ఒక యూనిట్ విలువను రూ.3.75 పైసల నుంచి రూ.2లకు తగ్గించారన్నారు. యూనిట్ పై రూ.1 తగ్గించం వల్ల అక్వా రంగంలో ఉన్న 50 వేల కనెక్షన్లకుగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.406 కోట్లను డిస్కమ్ లకు చెల్లిస్తోందన్నారు. రాష్ట్రంలో 700ల దోభీ ఘాట్లు ఉన్నాయని, వాటికి విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నామని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కోటి రూపాయల భారం పడుతోందని అన్నారు.