అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు 66 శాతం పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతిపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. 19 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందన్నారు. మరో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తం 62 ప్రాజెక్టుల పనులు శరవేగంగా చేస్తున్నామని పేర్కొన్నారు. జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలోపు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించాలని, రాబోయే 3 నెలలు తాగునీటిపై దృష్టి పెట్టాలన్నారు. వర్షాభావంలోనూ సాగునీటి కొరత లేకుండా చూశామని పేర్కొన్నారు. తాగునీటి కొరత నివారణపై మనందరం దృష్టి పెట్టాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో తాగునీటి రవాణాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే మన ధ్యేయమని అన్నారు. మార్కెటింగ్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అన్నదాతా సుఖీభవ మార్గదర్శకాలు సిద్ధం చేయాలన్నారు. కౌలు రైతులకు, 5 ఎకరాలు పైబడిన వారికి ఇస్తున్నామని పేర్కొన్నారు. కౌలు రైతులకు రూ.9,654 కోట్ల పంట రుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డు సాధించామన్నారు. 27లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నరేగాతో పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలన్నారు.