డబ్బుతో ముడిపడని రాజకీయాలను సామాన్యుడికి చేరువ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ పక్షాన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్ధిత్వం కోరుతూ వందలాది మంది ఆశావహులు స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరై బయోడేటాలను సమర్పిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే 210 మంది ఆశావహులు స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. లోక్ సభ, శాసన సభ స్థానాలకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆలుమగలు బయో డేటాలు ఇవ్వడం విశేషం. తమ జంటలో ఒకరికి జనసేన టికెట్ కేటాయించాలంటూ కమిటీ ముందుకు వచ్చారు. ఈ విధంగా ఆదివారంనాడు 8 జంటలు బయో డేటాలు సమర్పించాయి. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ బయో డేటాలు స్వీకరించి పరిశీలించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తుని స్వీకరించి సునిశితంగా పరిశీలించింది. వివిధ రంగాలకు చెందినవారు, వృత్తి నిపుణులు, ఉన్నత చదువులను అభ్యసించిన యువతీయువకులు వచ్చారు.
• మహిళల ఆసక్తి
కుటుంబాన్ని చక్కదిద్దే సమర్థత, నైపుణ్యం ఉన్న ఆడపడుచులు చట్ట సభల్లో ఉండాలని ప్రభావశీలంగా చెప్పడమే కాదు.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రతి సభలో చెబుతున్నారు. ఆదివారం వచ్చిన 210 మందిలో 45 మంది మహిళలు ఉన్నారు. వీరిలో గృహిణులు ఉన్నారు.