‘‘కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. విభజన హామీలు సాధించే వరకు పోరాటం ఆగదు’’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రపతిని కలవడానికి బయలుదేరిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలంటే.. కేంద్రం సహకరిస్తే 20.. 30 ఏళ్లు పడుతుందని, అలాంటిది.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందన్నారు. హైదరాబాద్ను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించామన్నారు. ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు.. మంచిది కాదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో పాదయాత్ర చేపట్టామని చంద్రబాబు తెలిపారు. జగన్ తన కేసుల మాఫీ కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. మోదీ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్షతప్పదు’’ అని చంద్రబాబు ఆక్రోశించారు. వైసీపీ.. బీజేపీతో కలిసి పనిచేస్తోందని, ఆ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. ప్రజా ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని చంద్రబాబు తెలిపారు.