పుల్వామా: ‘నా కొడుకును పోలీసులు దారుణంగా కొట్టారు. ముక్కు నేలకు రాయించారు. అప్పటి నుంచి పోలీసులపై కోపం పెంచుకున్నాడు. ఉగ్రవాదుల్లో చేరాలనుకున్నాడు. కానీ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు’ 40 మంది జవాన్ల ప్రాణాలను బలి తీసుకున్న అదిల్ అహ్మద్ దర్ తల్లిదండ్రులు చెబుతున్న మాటలివి. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై అదిల్ అహ్మద్ ఆత్మాహుతి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అదిల్ తల్లిదండ్రులను మీడియా ప్రశ్నించగా.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.‘మూడేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. పోలీసులపైకి రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన అదిల్ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయించారు. అలా ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. దీన్ని అదిల్ అవమానంగా భావించాడు. పోలీసులు నన్ను ఎందుకు కొట్టారంటూ పదే పదే దాన్నే గుర్తుచేసుకునేవాడు. ఆ ఘటనతో పోలీసులపై అదిల్ కోపం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఉగ్రవాదుల్లో చేరాలనుకున్నాడు’ అని అదిల్ తండ్రి గులామ్ హసన్ దర్ తెలిపారు.
ఉగ్రవాదాన్ని వీడాలని తాము ఎన్నో సార్లు అదిల్ను కోరామని, కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదని గులామ్ అన్నారు. అయితే జవాన్లపై దాడి చేస్తాడని తమకు తెలియదని చెప్పారు. 20ఏళ్ల అదిల్ చదువును మధ్యలోనే ఆపేసి గతేడాది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. దాడి జరగడానికి కొద్ది నెలల ముందు పుల్వామాకు 10 కిలోమీటర్ల దూరంలో ఓ ఇల్లు తీసుకున్నాడు. అక్కడ జైషే మహ్మద్ ఉగ్రవాదుల ఆధ్వర్యంలో ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ తీసుకున్నాడు. గురువారం పుల్వామా ప్రాంతంలో భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు కాన్వాయ్లో వెళ్తారని ముందుగా తెలుసుకున్న అదిల్ పేలుడు పదార్థాలున్న కారుతో వెళ్లి కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొట్టాడు.దాడి జరిగిన కొంతసేపటికే అదిల్ ఫొటోలు, వీడియోలను జైషే మహ్మద్ విడుదల చేసింది. ‘ఈ వీడియో మీకు చేరేసరికి నేను స్వర్గంలో ఉంటాను. కొంతమంది ఉగ్రవాదులను చంపినంతమాత్రాన మీరు మమ్మల్ని బలహీనపర్చలేరు’ అని అదిల్ వీడియోలో చెప్పాడు.