తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు కన్నీళ్లు కారుస్తున్నారు. చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోతుండడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం అకాల వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ సమయంలో బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఈ ప్రభావం వల్ల కోస్తాలో వర్షాలు కరుస్తాయని, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందన్నారు. అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాల్సినవసరం ఉంది. మరోవైపు కోస్తాలో భారీగానే మంచు కురుస్తోంది. ఉదయం 10గంటల వరకు కూడా మంచు వీడడం లేదు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.