ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 09:54 PM

ఏపీలో రైతులకు ముఖ్యగమనిక.. ఈ-పంటలో నమోదైతే పంటల బీమా వర్తిస్తుందని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. రైతు వాటాగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఖరీఫ్‌ పంటకాలానికి జిల్లాలవారీగా ఎంపికచేసిన పంటలకు ఉచితంగా పీఎంఎఫ్‌బీవై (ప్రధానమంత్రి ఫసల్‌ బీమా), ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ (వాతావరణ ఆధారిత పంటల బీమా) పథకాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రబీ నుంచి పంటల బీమా కావాలంటే.. రైతులే తమ వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అన్నారు. రైతులు ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5%, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% చొప్పున ప్రీమియం చెల్లించాలని సూచించారు ఢిల్లీ రావు.


మరోవైపు ఈ-పంట డిజిటల్‌ యాప్‌లో వాస్తవ సాగుదారుల పేర్లనే నమోదు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలని.. అప్పుడే ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారని తెలిపారు. ప్రధానంగా పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అంతేకాదు ఈ-పంట నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పంటకు సంబంధించి పేర్లను నమోదు చేస్తున్నారు.. సెప్టెంబర్ 15 వరకు రైతులకు గడువు ఉంది.


రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ చేస్తారు. ప్రధానంగా రైతు ఆధార్, మొబైల్ నెంబర్, పొలం సర్వే నెంబర్‌తో పాటుగా పొలం దగ్గర ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వ్యవసాయశాఖ సిబ్బంది పంట నమోదు పూర్తైన తర్వాత ఈ-కేవైసీకి వేలిముద్రలు తీసుకున్న తర్వాత.. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు అధికారులు. రైతులు ఇవన్నీ పూర్తి చేస్తే ప్రభుత్వ పథకాలకు అర్హులని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com